*🔱శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే...!
👉🏾చాలా సంవత్సరాల క్రితం కాంచీవరం లో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండే వాడు. అతను బంగారు నగలు తయారు చెయ్యడంలో నిపుణుడు.
అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్లు ధరించే గొలుసులు , గాజులు , పాపిడి చేరు లాటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా , నడుముకి ధరించే , వడ్డాణం అతను చేస్తే చాలా బాగా అమరేది. అతను చేసినంత బాగా నడుముకి పెట్టుకొనే నగ చేయడం ఇంకెవరి వల్లనా అయేది కాదు. దానివల్ల అందరూ అతని చేతే నగలు చేయించుకోవాలని ఉబలాటపడేవారు.
స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగు ఉండేది కాదు. కానీ అతను అపర శివ భక్తుడు. విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు.
దాని వలన అతను కేవలం శివ భక్తులకి మాత్రమే నగలు చేసేవాడు. అదీ కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోడం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించిగానీ , రాజాశ్రయం గురించి గానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు.
ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహా విష్ణువు కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణ కారులు తయారు చేసేసారు. అయితే , స్వామి వారి నడుముకి పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు.
మహారాణీకి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకి శివయ్య గురించి చెప్పీ తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకి పెట్టే నగలు తెప్పించి రాణీ గారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణీ మైమరచిపోయింది. శివయ్య చేత స్వామి వారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించి , శివయ్యని పిలిపించింది.
ఈ విషయం తెలీని శివయ్య, రాణీగారి వద్దకు వచ్చేడు. రాణీగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని , తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పేడు. మహా రాణీకి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చెయ్యడు ? అన్న పంతం వచ్చింది.
అక్కడ శివయ్య గురించి తెలిసినవారు జోక్యం చేసుకొని శివయ్యతో ఇలా చెప్పేరు.
" శివయ్యా ! ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికీ , ఈ నగ చేసేయ్ ! లేకుంటే , అనవసరంగా , శిక్షకి గురికావలసి ఉంటుంది." అయితే శివయ్య , నేను విష్ణు ఆలయంలోకి వెళ్లను కదా ! కొలతలు లేకుండా నగ ఎలా చెయ్యాలి ? అని అడిగేడు.
దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము. నువ్వు దాని ప్రకారం , నగ చేసెయ్యి , చాలు అని స్వామి వారి నడుము కొలతలు తీసి శివయ్య కి అంద జేసారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకి తన ఊరు వెళ్లడానికి అనుమతి ఇమ్మని అడిగేడు.
రాణీ ఆలయ పెద్దలతో , ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయింది.
మళ్లీ మహా రాణి శివయ్య ని నగ సరి చేసి ఇమ్మంది. శివయ్య చేసి ఇచ్చేడు. మళ్లీ అలాగే చిన్నది అయింది. ఇలా మూడు సార్లు జరిగే సరికి శివయ్యే ఆశ్చర్య పోయేడు. కొలత సరిగా ఇవ్వటం లేదేమొ అందుకే సరిగా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది.
కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా ! దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పేడు. "నువ్వు కళ్లకి గంతలు కట్డుకొని రా ! మేము నీకు సాయం చేస్తాం" అన్నారు శివయ్యకి ఇష్టం లేక పోయినా , ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదాని , కళ్లకి గంతలు కట్టుకొని గుడికి బయలుదేరేడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది.
గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కొలత తీసుకునేటందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివ లింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కి పడి , ఇదేమిటి ? ఇది శివాలయమా ! అనుకుంటూ కళ్ల గంతలు తీసేసాడు.
ఎదురుగా విష్ణు విగ్రహం. చటక్కున కళ్లు మూసుకొని మళ్లా కొలతలకని నడుముని తాకేసరికి , ఈసారి చేతికి నెలవంక , నాగుపాము తగిలేయి. మళ్లీ ఆశ్చర్యంతో కళ్లు తెరిచి చూసేసరికి శ్రీ మహా విష్ణువే ! మళ్లీ కళ్లు మూసుకొని కొలత తియ్యబోతే అర్ధ నారీశ్వరం లా తోచింది. కళ్లు తెరిస్తే మహా విష్షు కళ్లు మూస్తే శివుడూ లా గోచరిస్తూ ఉండేసరికి శివయ్య కే కనువిప్పు అయింది.
వెంటనే చెంపలు వాయించుకుంటూ
" స్వామీ ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా ! శివ కేశవులు ఒకరే అన్న గొప్ప నిజం తెలిసినా , అహంకారం చేత విష్ణువు కన్నా , శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసినా , ఈ దీనుడికి అసలు నిజం బోధపడేట్టు రుజువు చేసేవు. ఇక పై నా జీవితం శివ కేశవ సేవకే వినియోగిస్తాను" అని పాదాభిషేకం చేస్తున్న శివయ్య ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ముందుగా మహారాణి తేరుకొని , శివయ్యా ! నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే , స్వామి నీద్వారా శివకేశవులు ఒకటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ తెలియజెప్పేరు. ఇకపై ఎవరూ శివ కేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను " అని ప్రకటించింది ప్రజలందరూ హర్షం ప్రకటించారు.
ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అతికినట్డు సరిపోయింది.
మరెన్నో మరెన్నో ఇలాంటి సమాచారాలు పొందాలంటే
మన గురు . మన ఓంకారం
ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి
https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ
మీకు ముందుగానే సమాచారం వస్తుంది.
శ్రీ గురూజీ మహారాజ్
జ్యోతిష్య బ్రహ్మ ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత
No comments:
Post a Comment